హుజూర్‌నగర్‌లో పోటీ చేస్తాం... 

3 Jun, 2019 07:32 IST|Sakshi

ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ 

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ పోటీలో ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్‌ క్లబ్‌లో జరిగిన పార్టీ ద్వితీయ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. నల్లగొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే రాజీనామా చేస్తారన్న సమాచారం ఉందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా ఇంటి పార్టీకి ఒక అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని కాంగ్రెస్‌ మాటిచ్చిందని, అనివార్య కారణాలతో ఇవ్వలేకపోయిందని గుర్తుచేశారు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు కోసం, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటి పార్టీ కృషి చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించి హుజూర్‌నగర్‌కు జరిగే ఉప ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని కోరారు. 

మరిన్ని వార్తలు