ఖాతా తెరవని టీజేఎస్‌!

12 Dec, 2018 06:30 IST|Sakshi

రాజకీయాల్లో పని చేయని ‘సార్‌’ఛరిష్మా

ఫలితాలతో మరింత కుదేలు 

పార్టీ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఈ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలువలేకపోయింది. ఉద్యమ ఆకాంక్షల నినాదం పెద్దగా పని చేయలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై ఒక కుటుంబం పెత్తనం చేస్తూ, ఇష్టానుసారం వనరులను దోచుకుంటూ, హక్కులను హరిస్తూ, నిరంకుశంగా పాలిస్తూ, ప్రజలధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే మౌనంగా ఉండకూడదన్న సంకల్పంతోనే పార్టీ పెడుతున్నాం అంటూ ప్రజల ముందుకు వచ్చిన టీజేఎస్‌ ఈ ఎన్నికల్లో తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. 2018 మార్చి 31న ఏర్పడిన టీజేఎస్‌.. ఏప్రిల్‌ 29న భారీ బహిరంగ సభతో ప్రజల ముందుకు వచ్చింది.

ఈ ఎన్నికల్లో 4 స్థానాల్లో సొంతంగా, మరో 4 స్థానాల్లో ప్రజా కూటమిలో స్నేహపూర్వక పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలువలేకపోయింది. కూటమిలో టీడీపీ భాగస్వామి కావడం, సభల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయడంతో ప్రజలు కూటమిని కూడా తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌తో పాటు టీజేఎస్‌ కూడా తన ఉనికిని కో ల్పోయింది. టీజేఎస్‌ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన కపిలవాయి దిలీప్‌కుమార్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. అంబర్‌పేటలో నిజ్జన రమేశ్‌ది అదే పరిస్థితి. వర్ధన్నపేటలో పి.దేవయ్య, సిద్దిపేటలో ఎం.భవాని రెండో స్థానంలో నిలిచారు. స్నేహపూర్వక పోటీ కింద వరంగల్‌ ఈస్ట్‌లో గాదె ఇన్నయ్య, దుబ్బాకలో రాజ్‌కుమార్, ఆసిఫాబాద్‌లో విజయ్‌కుమార్, ఖానాపూర్‌లో భీంరావును పోటీలో దింపినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. 

భవిష్యత్తు ఏంటి? 
టీజేఎస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కూటమి అధికారం లోకి వస్తే కొన్ని ఎమ్మెల్సీ స్థానాలను తీసుకొని పార్టీ ని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉన్న టీజేఎస్‌కు ఆ అవకాశమూ లేకుండాపోయింది. ఈ నేప థ్యంలో పార్టీ భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. 

మరిన్ని వార్తలు