విలీనాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది: ఉత్తమ్‌

18 Sep, 2019 04:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాటంలోకానీ, హైదరాబాద్‌ విలీనంలో కానీ, తెలంగాణ ఏర్పాటులోకానీ బీజేపీ, సంఘ్‌పరివార్‌ పాత్ర లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చరిత్రను వక్రీకరించి తెలంగాణ విలీనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మంగళవారం గాందీభవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. నిజాం నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరులో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమే కీలకపాత్ర పోషించాయని, నిజాం వ్యతిరేక పోరాటంలో బీజేపీ లేనేలేదని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు తెలంగాణ చరిత్ర తెలియదని, అయితే చరిత్ర ఒకరు మారిస్తే మారేది కాదని బీజేపీ నేతలు గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, అంజన్‌కుమార్‌ యాదవ్, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఎం.కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కేకే, జి.నిరంజన్, వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, ఇందిరాశోభన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు