నిజాంపేటలో కారు జోరు.. కార్పొరేషన్‌ కైవసం

25 Jan, 2020 15:53 IST|Sakshi

సాక్షి, హైదారాబాద్‌ : రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతోంది. నిజాంపేట కారు తిరుగులేని జోరును ప్రదర్శించి కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 22 డివిజన్లలో ఫలితాలు వెలువడగా.. 19 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మూడు డివిజన్లలో దయాకర్‌రెడ్డి ప్యానల్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కార్పొరేషన్‌ కైవసం చేసుకోవాలంటే 17 డివిజన్లలో విజయం సాధించాలి. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే 19 డివిజన్లలో విజయం సాధించింది.

టీఆర్‌ఎస్‌ భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నిజాంపేటకు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు నిజాంపేటలో పోలింగ్‌ కౌంటింగ​ మందకొడిగా సాగుతోంది. తుది ఫలితం వెలువడేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాపతంగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్‌ శాతం నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే నమోదైంది. తక్కువ పోలింగ్‌ శాతం నమోదైనప్పటికీ ఫలితాలు వెల్లడిలో మాత్రం తీవ్రమైన ఆలస్యం నెలకొంది. 

ఇక బోడుప్పల్‌(28)లో టీఆర్‌ఎస్‌ 14, కాంగ్రెస్‌7, బీజేపీ 2, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. ఫిర్జాదిగూడ 26 స్థానాలకు గాను 16 స్థానాలను కారు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ మూడు స్తానాల్లో గెలుపొందింది. జవనహార్‌ నగర్‌లో కూడా కారు జోరు కొనసాగింది. 26 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 16, కాంగ్రెస్‌ 3, బీజేపీ 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు.

మరిన్ని వార్తలు