సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రాదేశిక పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తలమునకలయ్యారు. మండుటెండల్లోనూ పార్టీ నుంచి బరిలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోరునే తలపించే విధంగా పగలు ప్రచారం.. రాత్రివేళ పార్టీ క్యాడర్తో భేటీ అవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా చోట్ల అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు సన్నద్ధం కావడం.. వారిలో అధిష్టానం పలువురిని మాత్రమే పార్టీ అభ్యర్థులుగా బరిలో దించడంతో మిగతా ఆశావహుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆశావహులను బుజ్జగించి రెబల్స్ బెదడ లేకుండా చూడాలన్న పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులందరూ పని చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి మాత్రమే బరిలో ఉండేటట్టు మిగతా వారిని బుజ్జగిస్తున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థి లేని స్థానాలపై దృష్టి సారించిన గులాబీ నేతలు సంప్రదింపులు చేస్తూ నామమాత్రం పోటీకి ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులను సైతం బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యే నుంచి సర్పంచ్ వరకు దాదాపు అన్ని స్థానాల్లో అధికార టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు ఉండడం.. రాష్ట్రంలో అదే పార్టీ ప్రభుత్వం కొలువుదీరి ఉండడంతో దాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని గులాబీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 10 ఎంపీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. బలమైన ప్రత్యర్థులున్న చోట ప్రత్యేక దృష్టిసారించి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సలహాలు, సూచనల మేరకు అవసరమున్న చోట ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
మిగిలింది మలి, తుది పోరు..
ఈ నెల ఆరో తేదీన ప్రాదేశిక ఎన్నికల తొలి పోరు ముగిసింది. ఈ నెల 10న మలి, 14న తుది పోరు మిగిలి ఉంది. తొలి పోరులో 24 జెడ్పీటీసీ.. 291 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో దాదాపు అన్ని స్థానాలూ తమవే అనే ధీమాతో ఉన్న గులాబీ నేతలు మిగిలిన రెండో, మూడో విడత ఎన్నికలపైనా అదే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మిగిలిన ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రులిద్దరూ తమ నియోజకవర్గాలతో పాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గులాబీ అధినేత కేసీఆర్ మన్ననలు పొందాలనే యోచనతో ఉన్నారు.