టీఆర్‌ఎస్‌లో చేరనున్న శోభారాణి

21 Mar, 2019 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీలో తెలుగు తమ్ముళ్లు షాక్‌ ఇస్తుంటే... తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో ఝలక్‌ తగలనుంది. తెలంగాణ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి సైకిల్‌ దిగి కారెక్కే యోచనలో ఉన్నారు. ఆమె త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె టీఆర్‌ఎస్‌ అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు కీలక టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరగా, మరికొంతమంది బీజేపీలో చేరుతున్నారు.

కాగా తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలను టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబును శోభారాణితో పాటు పార్టీ నేతలు విజ్ఞప్తి చేసినా, సరైన స్పందన లేకపోవడంతో ...టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దించితే కచ్చితంగా గెలిపించుకుంటామని... ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉందని చంద్రబాబుకు చెప్పినా పరిగణనలోకి తీసుకోకపోవడంతో పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ తమ్ముళ్లు...ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు.

మరిన్ని వార్తలు