బరిలో ఎవరో? 

2 May, 2019 08:02 IST|Sakshi

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికల సందడి నెలకొంది. మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ఇప్పటికే పూర్తవ్వగా గ్రామాల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రెండో విడత నామినేషన్ల ఉపసంహరణకు  గురువారం మధ్యాహ్నం 3 గంటలతో సమయం ముగుస్తుంది. గతనెల 28వ తేదీ  ఆదివారం రెండోవిడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాలకు మొత్తంగా జెడ్పీటీసీలకు 53, ఎంపీటీసీలకు 538 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో ఎంత మంది విత్‌డ్రా చేసుకుని ఎంత మంది బరిలో నిలుస్తారో గురువారం తెలుస్తుంది.

జెడ్పీటీసీలో బీజేపీకి రెబల్స్‌ దెబ్బ 
రెండోవిడత జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఒక్క స్థానానికి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇందులో అడ్డాకుల జెడ్పీటీసీకి బీజేపీ తరపున ఇద్దరు, మూసాపేటకు ముగ్గురు, దేవరకద్ర నుంచి ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు. గురువారం జరిగే నామినేషన్ల ఉపసంహరణలో ఆ పార్టీ నాయకత్వంతో రెబల్స్‌గా వేసిన వారితో విత్‌డ్రా చేయిస్తారో.. లేక వారు బరిలో ఉంటారో తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్‌కూ అదే బెంగ 
కాంగ్రెస్‌పార్టీకి కూడా రెబెల్స్‌ నుంచి పోటీ నెలకొంది. సీసీ కుంట నుంచి ఇద్దరు, కోయిల్‌కొండ నుంచి ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. వీరిలో పార్టీ ఎవరికి బీ ఫాం ఇస్తుందో.. ఎవరితో విత్‌డ్రా చేయిస్తుందో తెలియదు. పార్టీ ఆదేశాలను దిక్కరించి ఎవరు బరిలో రెబల్‌గా నిలుస్తారో చూడాలి.

టీఆర్‌ఎస్‌ లైన్‌ క్లియర్‌ 
రెండోవిడతకు టీఆర్‌ఎస్‌ పార్టీకి లైన్‌ క్లీయర్‌ అయింది. రెండోవిడత జరిగే స్థానాలకు ఒక్కో నామినేసన్‌ మాత్రమే వచ్చాయి. దీంతో అధికారికంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి రెబల్స్‌ బెడద లేకుండా పోయింది. ఆ పార్టీ  ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వారితో నామినేషన్లను వేయించింది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నచ్చజెప్పి ఒక్కరితోనే నామినేషన్లు వేయించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయారు.
  
ఏడుగురు ఇండిపెండెంట్లు 

ఈ విడతలో ఏడుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఇందులో అడ్డాకుల నుంచి ఇద్దరు, మహబూబ్‌నగర్, కోయిల్‌కొండ నుంచి ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు. హన్వాడ నుంచి ఒక్కరు బరిలో ఉన్నారు. గురువారం వీరు విత్‌డ్రా చేసుకుంటారా.. లేక  బరిలో నిలుస్తారా.. అని తెలియాల్సి ఉంది.
 
ఎంపీటీసీలో అన్ని పార్టీల్లో రెబల్స్‌ 
రెండోవిడత జరిగే 91 స్థానాలకు గాను 543 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ప్రధానపార్టీల నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఒక్క స్థానానికి నామినేషన్లు వేశారు. ఇందులో 91 ఎంపీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్‌పార్టీ నుంచి 119 మంది, టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 110 మంది, బీజేపీ నుంచి 96 నామినేషన్లు వేశారు. 83 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు.

విత్‌డ్రా చేయించే పనిలో నేతలు.. 
రెబల్స్‌ లేకుండా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ పార్టీ నాయకత్వంపై అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందే తమ ప్ర త్యేర్థులెవరో తెలుసుకుని ముం దుకు పోయారు. వారి వద్దకు వెళ్లి పోటీ నుంచి తప్పుకోవాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఒక ఎంపీటీసీ స్థానం నుంచి ఒకే పార్టీకి చెందిన నలుగురైదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో ఆయా పార్టీ నేతలు వారిని సుముదాయించుకునేందుకు చేస్తున్న ప్ర యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. అస మ్మతి నేతలను బరిలోంచి విత్‌డ్రా చేయించాలని అభ్యర్థులు తమకు తాము ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు.

మద్యాహ్నం 3 గంటల వరకే.. 
రెండో విడుత నామినేషన్ల పర్వానికి ఆదివారానికి తెర పడింది. మే 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటకు  నామినేషన్ల ఉపసంహరణకు చావరి గడువు ముగుస్తుంది.  అంతలోపు కార్యాలయంలో ఉన్న వారికి నామినేషన్ల ఉపసంహరణకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ రోజు 3 గంటల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. మే నెల 10వ తేదిన పోలింగ్‌ జరుగుతుంది.

మరిన్ని వార్తలు