కోడెల ఓ కళంకిత స్పీకర్‌!

28 Oct, 2017 12:59 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం

వైఎస్సార్‌సీపీ హైపవర్‌ కమిటీ సభ్యుడు తమ్మినేని

శ్రీకాకుళం అర్బన్‌: ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్న కోడెల శివప్రసాదరావు శాసనసభ చరిత్రలో ఓ కళంకిత స్పీకర్‌గా నిలిచిపోతారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర హైపవర్‌ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమే గాకుండా వారికి చం ద్రబాబు తన కేబినెట్‌లోనూ చేర్చుకొని ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెడధోరణులను నిరసిస్తూ, ఆ మం త్రులను బర్తరఫ్‌ చేసేవరకూ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని తమ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. శ్రీకాకుళంలో ని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మీడి యా సమావేశంలో మాట్లాడారు. కేవలం అధికార పార్టీ నేతల ప్రలోభాలకు లొంగిపోయి స్వార్థప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా ఆ పనికి ‘అభివృద్ధి’ ముసుగేయడం దారుణమన్నారు.

ప్రజాభిప్రాయానికి గండికొట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ కోడెలకు ఎన్నోమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం తగదని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా ఇప్పుడు శాసనసభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 66 మంది అని ప్రకటించడం గమనార్హమన్నారు. కోడెల కన్నా ముందు ఎంతోమంది స్పీకర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని, స్పీకరు కుర్చీకే వన్నె తెచ్చారని వ్యాఖ్యానించారు. వారికి భిన్నంగా కోడెల దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అందుకే శాసనసభ చరిత్రలో కళంకిత స్పీకర్‌గా కోడెల నిలిచిపోతారని విమర్శించారు. ఇలాంటి పెడధోరణులకు ముగింపు పలకాలనే తప్పని పరిస్థితుల్లో శాసనసభ సమావేశాల బహిష్కరణ నిర్ణయాన్ని తమ పార్టీ అధిష్టానం తీసుకుందని తమ్మినేని చెప్పారు. చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే ఫిరాయింపు చట్టంపై మీడియా ముందు చర్చకు సిద్ధమేనా? అని సవాల్‌ విసిరారు.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంకల్ప యాత్ర
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బాధలు తెలుసుకునేందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్పం’ పేరుతో పాదయాత్ర చేయనున్నారని ఆ పార్టీ రాష్ట్ర హైపవర్‌ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. నవంబరు 6 నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3 వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుందని చెప్పారు.   సమావేశంలో పార్టీ సీ ఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, పార్టీ నేత సీపాన రామారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు