పోరాటాలకు సిద్ధం కావాలి

12 Sep, 2019 03:58 IST|Sakshi

తెలంగాణ సాయుధపోరాట వార్షికోత్సవ సభలో వక్తల పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగ, ప్రజాస్వా మ్య పరిరక్షణకు వామపక్ష, ప్రజాస్వామ్యశక్తులు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సాయుధ పోరాటాలు, రాష్ట్ర చరిత్ర వక్రీకరణకు మతోన్మాదశక్తులు చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి హాల్‌లో తెలంగాణ అమరవీరుల మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బూర్గుల నర్సింగరావు అధ్యక్షతన సాయుధపోరాట వార్షికో త్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా గార్లపాటి రఘుపతిరెడ్డి రచించిన ‘ఉరికంబం ఎక్కుతూ తిరిగొచి్చన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు మాట్లాడారు.

తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్‌ ఉద్యమాలు చేపట్టాలన్నారు. నాటి ఉద్యమస్ఫూర్తితో పెరుగుతున్న ధరలు, ఇతర సమస్యలపై నేడు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు లు సాయుధ పోరాటం నిర్వహించిన ఫలితంగానే హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైందే తప్ప సర్దార్‌పటేల్‌ వల్ల కాదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. సాయుధపోరులో నాలుగున్నర వేల మంది అమరులైన చరిత్ర నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వం కోసం తెలంగాణ సమాజం పోరాడుతూనే ఉందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ కార్యక్రమంలో జైని మల్లయ్యగుప్తా, కందిమళ్ల ప్రతాపరెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, సీనియర్‌ పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి, పల్లా వెంకటరెడ్డి్డ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు