తిండి కూడా పెట్టకుండా వేధించారు : ఐశ్వర్య రాయ్‌

30 Sep, 2019 08:30 IST|Sakshi

సాక్షి, పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కోడలు ఐశ్వర్య రాయ్‌ అత్తింటి వారిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ‍్యమంత్రి, తన అత్త రబ్రీదేవి తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆడపడుచు మిసా భారతి తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని, తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు.

ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త తేజ్‌ ప్రతాప్‌, మరిది తేజస్వి ప్రతాప్‌ యాదవ్‌ మధ్య విబేధాలు సృష్టించడానికి భారతి ప్రయత్నిస్తున్నారని ఐశ్వర్య  పేర్కొన్నారు. రబ్రీ దేవి తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి, ఆర్‌జేడీ ఎమ్మెల్యే చంద్రిక రాయ్‌ ఆరోపించారు. దీనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించిన ఆయన తన కుమార్తెకు అత్తగారి ఇంట్లో అన్ని హక్కులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. (ఆదివారం సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు)

మరోవైపు రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి ఐశ్వర్యా రాయ్ ఆరోపణలను ఖండించారు.  గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున‍్న తాను ఆమెను ఎలా వేధించగలను అని ప్రశ్నించారు. తానెపుడు ఆమెను సోదరిలా భావించానంటూ ఐశ్యర్య ఆరోపణలు నిరాధారమైనవనీ కొట్టిపారేశారు. తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇదంతా చేస్తోందనీ,  తద్వారా తన ఆరోపణలకు మరింత బలం చేకూరాలని భావిస్తోందన్నారు.

కాగా 2018, మే నెలలో  అంగరంగ వైభవంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం​ జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్వర్య గృహ హింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో తేజ్‌ ప్రతాప్‌ విడాకుల కోసం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


 ఐశ్వర్య, ఆమె తండ్రి

చదవండి : కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య..

మరిన్ని వార్తలు