అమిత్‌ షా.. మళ్లీ పప్పులో కాలు!

30 Mar, 2018 10:40 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొన్న కార్యక్రమాల్లోనే అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు..’’ అంటూ అమిత్‌ షా ప్రసంగాన్ని పొరపాటుగా అనువదించడం సంచలనం రేపింది. ఇప్పటికే ‘యడ్యూరప్ప సర్కార్‌ అవినీతిలో నంబర్‌వన్‌’ అని నాలుక కరుచుకున్న షా.. పరోక్షంగా మళ్లీ పప్పులో కాలేసినట్లైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో వైరల్‌ అయింది.

అసలేం జరిగిందంటే..: ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవనగరి జిల్లాలో బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడారు. హిందీలో సాగిన షా ప్రసంగాన్ని.. ధర్వాడ ఎంపీ ప్రహ్లాద్‌ జోషి కన్నడలోకి అనువాదం చేశారు. సిద్ధరామయ్య రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, యడ్యూరప్పను సీఎం చేస్తే ఇద్దరూ(మోదీ-యడ్డీ) కలిసి రాష్ట్రాన్ని నంబంర్‌ వన్‌గా నిలబెడతారని అమిత్‌ షా పేర్కొన్నారు. అయితే ఆయన మాటలను కన్నడలోకి అనువదించిన ప్రహ్లాద్‌ మాత్రం.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు. యడ్యూరప్పను సీఎంగా గెలిపిస్తే పీఎం మోదీ సహకారంతో కర్ణాటకను నంబర్ వన్‌ రాష్ట్రంగా తయారుచేస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ తప్పుడు అనువాదాన్ని విన్న ప్రజలు, బీజేపీ నేతలు ఒక్కసారిగా విస్తుపోయారు.

సదరు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తప్పు అనువాదకుడిదే అయినా అమిత్‌ షా టాప్‌ లీడర్‌ కావడంతో ‘మళ్లీ పప్పులో కాలేశారు’ అంటూ కామెంట్లు మొదలయ్యాయి. మొన్న అమిత్‌ షా తడబాటు, తర్వాత అనువాదకుడి పొరపాటు ప్రత్యర్థులకు అనుకోని అస్త్రాలుగా మారాయి. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరుగనున్నాయి. మే 15న ఫలితాలు వెవడనున్నాయి. తాము అధికారంలో ఉన్న ఒకేఒక పెద్ద రాష్ట్రం కర్ణాటక కావడంతో తిరిగి పట్టునిలుపుకునేందుకు కాంగ్రెస్‌ విశ్వపయత్నం చేస్తోంది. అందుకు ఏమాత్రం తక్కువకాకుండా బీజేపీ పావులు కదుపుతోంది.

మరిన్ని వార్తలు