'అలాంటి వారిని గ్రామాల్లోకి రానివ్వం'

20 Nov, 2019 19:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్‌ మీడియం విధానంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నట్లు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదివితే టీడీపీకి నష్టమేంటో తనకు అర్థం కావడం లేదని తెలిపారు.

కార్పొరేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం చెప్తే తప్పు లేదు కాని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవకుండా టీడీపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలను ఉన్నత విద్యకు దూరం చేసి మళ్లీ అంటరానితనంలోకి నెట్టాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న వారిని గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటామని సుధాకర్‌బాబు హెచ్చరించారు.


 

మరిన్ని వార్తలు