మహనీయులు కోరిన సమసమాజం జగన్‌తోనే సాధ్యం

24 Jul, 2019 17:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించడం గొప్ప నిర్ణయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారని ప్రశంసించారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారని, మంత్రిమండలిలో 60శాతం మంత్రి పదవులు బడుగులకు ఇచ్చారని అన్నారు. 

ఇకనుంచి వైఎస్‌ జగన్‌కు ముందు. ఆ తర్వాత అని చెప్పుకోవాలని, మహనీయులు కోరిన సమసమాజం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందని టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌ కొత్త విప్లవాన్ని సృష్టించారని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన 14 నెలల సుదీర్ఘ పాదయాత్ర.. ప్రపంచంలోనే ఎవరూ చేయలేదని పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా వైఎస్‌ జగన్‌ చూశారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనను చూసి ప్రతిపక్షం భయపడుతోందన్నారు. అధికారంలోకి రాగానే ఎన్నో పథకాలు వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షం తట్టుకోలేకపోతున్నదని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారని, గత ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మహాశక్తిగా అభివర్ణించిన సుధాకర్‌బాబు తన ప్రసంగం ముగింపులో శ్రీశ్రీ ‘పదండి ముందుకు.. పదండి తోసుకు’ కవిత పంక్తులను చదివి వినిపించారు. 

లోకేశ్‌కు తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వందలాది మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత సైతం ఆత్మహత్యలు చేసుకోవడం చూశామని గుర్తు చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం గొప్ప విషయమని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు నిరుద్యోగుల తరఫున జక్కంపూడి రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారని, కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్‌కు తప్ప ఇతరులెవరికీ ఉద్యోగం రాలేదన్నారు.
 
వైఎస్‌ జగన్‌కు అభినందనలు
రాష్ట్రంలోనే దేశంలోనే మొదటిసారి ఇలాంటి చట్టాన్ని తీసుకువస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందలు తెలుపుతున్నానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత పేద రైతుల నుంచి కంపెనీలు భూములు తీసుకొని.. ఎంతోకొంత పరిహారాలు ఇచ్చి.. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయని, కానీ ఆ పరిశ్రమల్లో  ఆ రైతు ఇంట్లోని ఒక్కరికీ కూడా ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఈ పరిస్థితిని గమనించి.. ఇందులో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్‌ జగన్‌ ఈ బిల్లును తీసుకొచ్చారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఏర్పాటైన కియా మోటార్స్‌ కంపెనీలోనూ కిందిస్థాయి చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే స్థానికులకు ఇచ్చారని, ఒకవేళ తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉంటే.. స్థానికులకు ఆ కంపెనీలో మంచి ఉద్యోగాలు వచ్చేవని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు