ఎన్నికలు వాయిదా వేయరాదు

2 Apr, 2019 05:09 IST|Sakshi

సీఈఓకు కాంగ్రెస్‌ పార్టీ లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ఏర్పాట్ల పేరుతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయరాదని కాంగ్రెస్‌ కోరింది. షెడ్యూల్‌ ప్రకారమే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌కు సోమవారం టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎన్‌.నిరంజన్‌ లేఖ రాశారు. వీవీప్యాట్‌ రశీదులను ఏడు సెకన్ల పాటే ప్రదర్శిస్తుండడంతో ఓటు ఎవరికి పడిందో గుర్తించడానికి ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వీవీప్యాట్ల రశీదులను 30 సెకన్లపాటు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న 185 మంది అభ్యర్థుల్లో తమకు కావాల్సిన అభ్యర్థిని 12 బ్యాలెట్‌ యూనిట్లలో వెతికి గుర్తించడానికి సమయం పట్టనుందని, దీంతో పోలింగ్‌ వేళలను పెంచాలని కోరారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పోలింగ్‌ నిర్వహిస్తే సమయం సరిపడదని అన్నారు.

మరిన్ని వార్తలు