సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష బూటకమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్తో కాదు కాంగ్రెస్ ఇస్తే తెలంగాణ వచ్చిందన్నారు. విద్యార్థుల బలిదానాలను, ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధి తెలంగాణ ఇచ్చిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏమి చేయలేదని విమర్శించారు. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ ఎవరింటికైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఓ దొంగ.. మోసగాడని విమర్శించారు. ప్రజల సొమ్ముని దోచుకొని దానితోనే గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.
మానుకొండూరుకు చెందిన నలుగురు టీఆర్ఎస్ ఎంపీటీసీలు, ఒక ఎంపీపీ కాంగ్రెస్లోకి చేరారు. ఉత్తమ్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామన్నారు. దళిత గిరిజనులకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ను అందిస్తామన్నారు. ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, పది లక్షల మంది నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగభృతిని కల్పిస్తామని హామి ఇచ్చారు. అధికారంలోకి రాగానే బెజ్జంకి మండలాన్ని కరీంనగర్లో కలుపుతామన్నారు. 45రోజులు కార్యకర్తలు నిద్రాహారాలు లేకుండా పనిచేయాలని సూచించారు.