పీపుల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం రాబోతోంది: ఉత్తమ్‌

23 Nov, 2018 20:02 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ : ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవటం ఖాయమని, ఓటమి అనంతరం కేసీఆర్‌ ఫార్మ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు పారిపోతారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. నాలుగునర్రేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ తెలంగాణను భ్రస్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీని బొందపెట్టాలని, ఘోరి కట్టాలన్నారు. పీపుల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని జోష్యం చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతులకు 2లక్షల రూపాయల రుణ మాఫి ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చారు. లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యోగాలు కల్పించలేని యువతకు నెలకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు.

కేసీఆర్‌ మాట్లాడుతున్న పిచ్చి, పిచ్చి మాటల్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర కేసీఆర్‌ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ బిల్లులో ఉన్న ఖాజీపేట్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ గాని, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ గాని, గిరిజన యూనివర్శిటీ గాని ఐటీఆర్‌ని గాని మోదీ దగ్గర మంజూరు చేయించలేని సన్నాసి, దద్దమ్మ కేసీఆర్‌ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని అవమాన పరిచే విధంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నాడని అన్నారు.

మరిన్ని వార్తలు