డీసీసీలకు ఏ-ఫారంలు అందజేసిన టీపీసీసీ

21 Apr, 2019 15:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలకు నగరా మోగిన వేళ.. కాంగ్రెస్‌ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సీనియర్‌ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మల్లు భట్టివిక్రమార్క, జనారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్‌, కుసుమ కుమార్‌, దామోదర్‌ రాజనర్సింహలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, జిల్లా కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 32 మంది డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ ఏ-ఫారంలు అందజేసింది. 

కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు అందజేసే బాధ్యతను డీసీసీలకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో బరిలో నిలిచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక నాయకత్వానికి అప్పగించింది. అలాగే బి-ఫారమ్‌ పొందిన అభ్యర్థి 20 రూపాయల ప్రమాణ పత్రం ఇచ్చేలా ఒక ఆఫిడవిట్‌ రూపొందించి డీసీసీలకు అందజేసింది. కాగా, వచ్చే నెల 6, 10, 14 తేదీల్లో మూడు దశల్లో 32 జిల్లాల పరిధిలోని 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడు విడతల ఎన్నికల ఫలితాలను ఒకేసారి మే 27న ప్రకటించనున్నారు.

>
మరిన్ని వార్తలు