రీడిజైన్లతో తీరని అన్యాయం

5 May, 2018 12:24 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

ప్రాణహిత–చేవెళ్ల, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులను అటకెక్కించారు

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఎల్‌డీఎంఆర్‌సీ సమావేశంలో ప్రభుత్వంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి ఫైర్‌

చేవెళ్ల : రీడిజైన్‌ల పేరుతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క ఆరోపించారు. చేవెళ్ల మండలకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద శుక్రవారం ఎల్‌డీఎంఆర్‌సీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భట్టి విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా కురుసిన అకాల వర్షంతో రైతులు త్రీవంగా నష్టపోయారన్నారు. జిల్లాలో మొక్కజొన్న, వరిపంట పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. పంట నష్టాన్ని తక్షణమే అంచనావేసి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేవారు.

రీడిజైన్‌తో జిల్లా ప్రజలకు తీరని అన్యాయం...

తెలంగాణాలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్‌.రాజశేఖరరెడ్డి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్‌ చేయించారని, కానీ ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ ఎక్కడ కాంగ్రెస్‌ప్రభుత్వానికి దక్కుతుందోనని రీడిజైన్‌ పేరుతో ప్రాజెక్ట్‌ను ఆపేసే పరిస్థితి తీసుకువచ్చారని భట్టి విమర్శించారు.

ఐటీఐఆర్‌ప్రాజెక్టును అటకెక్కించారు...

రంగారెడ్డిజిల్లాకు వరప్రదాయని అయిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును నాటి యుపీఏ ప్రభుత్వం 2012లో మంజూరు చేస్తే కేసీఆర్‌ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందన్నారు. ఈ  ప్రాజెక్టుకై అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములు కూడా కేటాయించిందని గుర్తుచేసారు. అన్ని అనుమతులు మంజూరైనా ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవడంలేని ఆగ్రహం వ్యక్తం చేసారు.

హామీల విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా..?

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వందశాతం పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లీనరిలో చెప్పుకోవడం సిగ్గుచేటని, దీనిపై దమ్ముంటే జిల్లాలోని ఏదైనా గ్రామ సభలో బహిరంగంగా చర్చిందాం.. కేసీఆర్‌కు దమ్ముంటే తన సవాలు స్వీకరించాలని భట్టి సవాలు విసిరారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకుంటున్న రైతులకు 2013 చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈసమావేశంలో ఏఐసీసీసీ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ప్రసాద్, ఎల్‌డీఎంఆర్‌సీ రాష్ట్ర కన్వీనర్‌  వేణుగోపాల్, రాష్ట్ర ఎస్సీ సెల్‌ఉపాధ్యాక్షుడు ప్రీతమ్, డీసీసీ అద్యక్షుడు క్యామ మల్లేశ్, చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి  పి. వెంకటస్వామి, జిల్లా ఎస్సీ సెల్‌ అద్యక్షుడు దర్శన్‌  ఉన్నారు.

 కమిటీల బలోపేతానికి ఎల్‌డీఎంఆర్‌సీ ద్వారా కృషి... 

గ్రామ, మండలస్థాయిలోని కమిటీలను బలోపేతం చేసేందుకు ఎల్‌డీఎంఆర్‌సీ కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క అన్నారు. చేవెళ్ల మండలకేంద్రంలో శుక్రవారం ఎల్‌డీఎంఆర్‌సీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి పి.వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన  ఈ కార్యక్రమానికి ఎల్‌డీఎంఆర్‌సీ రాష్ట్ర కన్వీనర్‌ వేణుగోపాల్, ఏఐసీసీసీ ఎస్సీసెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ప్రసాద్, రాష్ట్ర ఎస్సీసెల్‌ ఉపాధ్యక్షుడు ప్రీతమ్‌ హాజరైనారు.  

ఈసందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు పక్కా ప్రణాళికలతో ఏఐసీసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఎల్‌డీఎంఆర్‌సీ పనిచేస్తోందన్నారు. కమిటీల వారిగా చేయాల్సిన పనులు, చేపడుతున్న కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యుల సందేహాలను తీర్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు దర్శన్, జిల్లాపార్టీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ ఆలూరు చైర్మన్‌ పి.క్రిష్ణారెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌లు వనం మహేందర్‌రెడ్డి, కసిరె వెంకటేశ్, మానేయ్య, ఎ–బ్లాక్‌ అధ్యక్షుడు పి.ప్రభాకర్, నాయకులు  వీరేందర్‌రెడ్డి, జంగారెడ్డి, శేఖర్‌రెడ్డి, మాధవ్‌గౌడ్, పర్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, బాలయ్య, ప్రకాశ్‌గౌడ్,  ఐదు మండలాలల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు