‘రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం’

19 Sep, 2018 17:01 IST|Sakshi
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క(ఫైల్‌ ఫోటో)

సాక్షి, మధిర : రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న టీఆర్ఎస్ ను గద్దె దింపేందుకే.. ఆత్మ గౌరవం యాత్ర చేపట్టినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం మధిర నియోజక వర్గం ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని విక్రమార్క ఆత్మగౌరవ యాత్రను మొదలు పెట్టారు. ఈ యాత్ర జమలాపురం నుంచి వెంకటాపురం వరకు సాగింది.

ఈ సందర్భంగా విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలను చూసి చలించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. అప్పట్లో శాసన సభలో.. కేవలం పదిమంది సభ్యులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.

ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న తాను విభజన బిల్లును సభలో ప్రవేశ పెట్టానని గుర్తుచేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. కొత్త రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఏర్పాటు చేస్తే.. కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోందని అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు