-

సీఎం చంద్రబాబు ఎదుటే మహిళల నిరసన

5 Jan, 2019 15:30 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాలకు అడుగడుగునా నిరసన సెగలుస తగులుతున్నాయి. తాజాగా జిల్లాలోని రాజాం మండలం పొగిరిలో సీఎం చంద్రబాబు శనివారంజన్మభూమి సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతుండగానే.. మహిళలు ఆందోళనకు దిగారు. సభలో లేచినిలబడిన మహిళలు తమకు ఇళ్లు ఇవ్వలేదని, చంద్రబాబు ప్రభుత్వం వల్ల తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలియజేస్తూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంతకవిటి మండలం తాలాడకు చెందిన గిరిజన మహిళలు ఈ మేరకు సీఎం సభలో నిరసన గళం ఎత్తారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఎల్‌ఎన్‌ పేట మండలం దనుకువాడలో జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎళ్ల తరడబి అర్జీలు ఇస్తున్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామసభను అడ్డుకొని.. అధికారులను గ్రామస్తులు వెనక్కిపంపారు.

నాతో పెట్టుకుంటే ఫినిష్‌..
కాగా ‘‘నాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతారు జాగ్రత్త’’ అని తనను అడ్డుకున్న మహిళలను సీఎం చంద్రబాబు కాకినాడలో హెచ్చరించడంపై దుమారం రేగుతోంది. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన  ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కాన్వాయ్‌ను కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులో పలువురు అడ్డుకున్నారు. ‘సీఎం గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బస్సులో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చి మండిపడ్డారు. మీకు ఏం కావాలంటూ రుసరుసలాడారు. తనను అడ్డుకున్న వారికి రాష్ట్రంలో ఉండే అర్హతలేదంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘లేనిపోని ప్రాబ్లమ్స్‌ పెట్టుకోవద్దు ఇక్కడ..పెట్టుకుంటే మీరు ఫినిష్‌ అయిపోతారు మర్యాదగా ఉండు..చాలా సమస్యలు వస్తాయి..ఢిల్లీలో నిన్న కూడా లాఠీ చార్జీ చేశారు.ఈ నీళ్లు తాగుతున్నారు.. ఈ గడ్డ మీద ఉన్నారు... ఏయ్‌ ఉండండీ.. నేను అడిగింది చెప్పు.. ఏం చేశారు మీ మోదీ.. ముంచాడు అందరినీ.. రాష్ట్రాన్నీ, దేశాన్ని...బయటకు వస్తే వదలరు.. మిమ్మల్ని పబ్లిక్‌...ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా..?’ అంటూ తనను అడ్డుకున్న మహిళలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు