మన్యంలో మగ్గి పోతున్నామయ్యా..

25 Nov, 2018 04:05 IST|Sakshi
బీజే పురం వద్ద జననేత వెంట నడుస్తున్న జనసందోహం

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన గిరిజనం  

అందరి సమస్యలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జననేత 

3,300 కి.మీ మైలు రాయిని అధిగమించిన పాదయాత్ర 

నేటితో విజయనగరం జిల్లాలో ముగింపు 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘అయ్యా.. మావి గిరిజన గ్రామాలు.. కనీస వసతులు లేక కునారిల్లుతున్నాం.. గొంతు తడుపుకుందామంటే మంచి నీటికి కూడా కరువే.. కలుషిత నీరే మాకు దిక్కు.. రాకపోకలకు రహదారులూ సక్రమంగా లేవు.. రోగమొస్తే దైవాధీనం.. సమస్యల గురించి పాలక పార్టీ నేతలు అసలు పట్టించుకోవడం లేదు. అధికారులూ శ్రద్ధ చూపడం లేదు’అని వివిధ గ్రామాల గిరిజనులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 304వ రోజు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కురుపాం నియోజకవర్గంలోని జియమ్మవలస మండల గ్రామాల్లో పాదయాత్ర సాగించారు.

ఈ క్రమంలో తురకనాయుడు వలస వద్ద 3,300 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. శిఖబడి క్రాస్‌ నుంచి ప్రారంభమైన యాత్ర గెడ్డతిరువాడ, ఇటిక, కుందరతిరువాడ క్రాస్, చిన్నకుడమ క్రాస్, తురకనాయుడువలస వరకు సాగింది. ఆద్యంతం మన్నెం ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. తాము ఎదుర్కొంటున్న అసంఖ్యాకమైన సమస్యలను జననేత దృష్టికి తెచ్చారు. అంకువరం, చిన్న బుడ్డివరం గ్రామ మహిళలు జగన్‌ను కలిసి తమకు తాగునీరు లభించడం లేదని మొర పెట్టుకున్నారు. గెడ్డకు వెళ్లి కలుషిత నీరు తెచ్చుకుని తాగాల్సిన దుస్థితిలో ఉన్నామని వాపోయారు. 

సంక్షేమ పథకాలన్నీ వారికేనట.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమ గ్రామాల కోసం ఒక ఫిల్టర్‌ బావిని ఏర్పాటు చేసినా, అక్కడి నుంచి పైపులు, కొళాయిలు వేసిన పాపాన పోలేదని ప్రజలు జగన్‌ ఎదుట వాపోయారు. అధికార పార్టీ నాయకులకు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అలమండ, కొండ చిలకాం, టీకే జమ్ము, పెద్ద తోలుమండ గ్రామాల్లో కనీస వసతులు లేవని, అనేక సమస్యలున్నాయని తూర్పు ముఠా గ్రామాల గిరిజనులు వివరించారు. టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, రుణాలను ఇస్తున్నారని అర్హులైన తమకు మంజూరు చేయడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.   

తిత్లీ బాధితులను ఆదుకోలేదు.. 
తాము తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని శివాడ గ్రామానికి చెందిన తిత్లీ తుపాను బాధితులైన పలువురు రైతులు జగన్‌ను కలుసుకుని విన్నవించారు. తమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యాయం చేస్తారన్న నమ్మకం పోయిందని అగ్రిగోల్డ్‌లో బాధితులు పలువురు జననేత వద్ద కష్టాలు ఏకరువుపెట్టారు. మీరు అధికారంలోకి రాగానే ఆదుకోవాలని కోరారు. కాగా, ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్న జగన్‌ పాదయాత్ర జిల్లాలో 350 కిలోమీటర్ల మేర సాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు