సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

6 May, 2020 02:52 IST|Sakshi
గాంధీభవన్‌లో దీక్షలో కూర్చున్న ఉత్తమ్, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు

ప్రతిపక్షాలను తిట్టడం మీద పెట్టే శ్రద్ధ పాలనపై ఏది?

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ నిర్లక్ష్యం

‘సత్యాగ్రహ దీక్ష’లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌..దీక్షలో కూర్చున్న పొన్నం, వీహెచ్, మర్రి

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షాలను తిట్టడం మీద పెట్టిన శ్రద్ధను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై పెట్టడం లేదని, కరోనా సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వలస కార్మి కులు ఎంతమంది ఉంటారో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకపోవడం ఆశ్చ ర్యంగా ఉందని, కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పరిపాలనలోనూ, రైతుల పంటలను కొనుగోలు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కాంగ్రెస్‌ నేతలు గాంధీ భవన్‌లో చేపట్టిన ఒక రోజు సత్యాగ్రహ దీక్షలో కూర్చున్న ఉత్తమ్‌ మాట్లాడుతూ...ప్రభుత్వ తీరుతో వలస కార్మికుల జీవితాలు నాశనమయ్యాయన్నారు.

వలస కార్మికుల కోసం హైదరాబాద్‌లో 400 అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టామని ప్రభుత్వం చెపుతోందని, అవి ఎక్కడ ఉన్నాయనే వివరాలు కూడా లేవన్నా రు. వలస కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వలస కార్మికులు ఊళ్లకు వెళ్లేందుకు రైల్వే శాఖ రూ.50 వసూలు చేస్తోందని, వారి వద్ద డబ్బులు వసూలు చేయవద్దని, కాంగ్రెస్‌ పార్టీ ఆ ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో వైన్‌ షాపుల విషయంలో అత్యుత్సాహం చూపవద్దని ఉత్తమ్‌ కోరారు.

ఈ దీక్షలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, అంజన్‌ కుమార్‌ యాద వ్, టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నాయకులు బెల్లయ్య నాయక్, దాసోజు శ్రవణ్, మేడిపల్లి సత్యం తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఎంపీ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, టీపీసీసీ నేతలు నిరంజన్, బొల్లు కిషన్, ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, మానవతారాయ్‌ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు 
కాగా, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి,  కుసుమ కుమార్, మల్లు రవి తదితరులు వారి ఇళ్లల్లో దీక్షలు చేశారు.

>
మరిన్ని వార్తలు