‘డబ్బులు పెట్టి బెదిరించి ఎమ్మెల్సీ అయ్యాడు’

25 Sep, 2018 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆత్మగౌరవం అనే మాటకు అర్హతలేని వారు కొండా దంపతులని టీఆర్‌ఎస్‌ నాయకుడు బస్వరాజ్‌ సారయ్య విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా దంపతులు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై నియోజకవర్గంలో తిరగలేదన్నారు. కొండా సురేఖ నేతృత్వంలో ఏక్కరు కూడా బాగుపడలేదన్నారు. గతంలో టీడీపీలో ఉండి తుపాకితో కుక్కను కాల్చి సర్పంచ్‌ అయిన వ్యక్తి కొండా మురళి అని, అలాంటి వారు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మగౌరవం అంటే ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కొండా మురళి డబ్బులు పెట్టి, బెదిరించి ఎమ్మెల్సీ అయ్యాడని ఆరోపించారు. కొండా దంపతులకు రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెడితే, కేసీఆర్‌ పునర్జన్మ ఇచ్చారన్నారు. గతంలో ఈ మాట సురేఖనే అన్నారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శించడం​సబబు కాదన్నారు. తెలంగాణ అని పలికే అర్హత కొండా దంపతులకు లేదన్నారు. కొండా దంపతులను వరంగల్‌ నుంచి కాదు కదా తెలంగాణ నుంచే తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. హరీశ్‌ రావు, కేటీఆర్‌ వేరు వేరు గ్రూపులు కాదన్నారు. కాంగ్రెస్‌లోలాగా టీఆర్‌ఎస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని సారయ్య పేర్కొన్నారు.

లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాం : నన్నపునేని నరేందర్‌
ప్రపంచంలో ఆత్మగౌరవం అనే మాటకు అర్హత లేని వారు ఎవరైనా ఉన్నారంటే అది కొండా దంపతులు మాత్రమేనని వరంగల్‌ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ ఎద్దేవా చేశారు. దొర పాలన చేసేది సురేఖ కుటుంబమేనని విమర్శించారు. ఈ కాలం పిల్లలకు దొర అంటే మీ భర్తనే చూపించాలని ఎద్దేవా చేశారు. కొండా సురేఖ నాన్న చనిపోతే ఆమె భర్తే రాలేదని, కేసీఆర్‌ ఎలా వస్తారని ప్రశ్నించారు.

తూర్పు నియోజక వర్గంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతోనే బతుకుతున్నారన్నారు. 2019వరకూ కొండా దంపతులు రాజకీయ సమాధి కాబోతున్నారని వ్యాఖ్యానించారు. కొండా దంపతులకు నిజంగా రాజకీయ బలం ఉంటే వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటి చేయాలని సవాల్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు బరిలోకి దిగినా కొండా సురేఖపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌ తప్పు చేసింది.. ఆ నూటైదుమంది కన్నాహీనమా నేను!

మరిన్ని వార్తలు