వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం

30 Apr, 2018 04:41 IST|Sakshi

కాంగ్రెస్‌ జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీకి హాజరైన రాష్ట్ర నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ‘జన్‌ ఆక్రోశ్‌’ర్యాలీకి రాష్ట్ర నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీ కలగానే మారిందన్నారు.

హామీల అమలులో విఫలమైన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. అలాగే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని, టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రాహుల్‌ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడయ్యాక మొదటిసారి చేపట్టిన ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, డీకె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, రాపోలు ఆనందభాస్కర్, మర్రి శశిధర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, ప్రమోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు