ఓట్లు వేయలేదని వీధిలైట్లు కట్‌! 

10 Dec, 2018 02:05 IST|Sakshi
ఆందోళన చేస్తున్న కేతేపల్లి గ్రామస్తులు

వనపర్తి జిల్లా కేతేపల్లిలో టీఆర్‌ఎస్‌ నేతల కక్షసాధింపు

పాన్‌గల్‌: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి గ్రామస్తులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో గ్రామంలోని వీధి లైట్ల కనెక్షన్లను తొలగించారు. ఈ ఘటన ఆదివారం వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం కేతేపల్లిలో కలకలం రేపింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గ్రామస్తులు ఓట్లు వేయలేదనే అక్కసుతో వీధి లైట్లకు విద్యుత్‌ కనెక్షన్లను మాజీ సర్పంచ్‌ రేవతి భర్త రాజు గౌడ్‌  తొలగించారు.  కొన్ని కాలనీల్లో కుళాయి కనెక్షన్లను సైతం తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ నేతల ఆధ్వర్యంలో  రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాన్‌గల్‌ ఎస్సై తిరు పాజీ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిపై ఆరాతీశారు.

వీధి దీపాలకు తొలగించిన కనెక్షన్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. సంబంధి త వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ విషయాలను గ్రామస్తులు కలెక్టర్‌తో పాటు మండల అధికారులు, గ్రామ ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాజుగౌడ్‌ను వివరణ కోరగా.. తమ పదవీ కాలంలో ఏర్పాటు చేసిన వీధి లైట్లకు బిల్లులు చెల్లించకపోవడంతోనే కనెక్షన్‌ తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.  

మరిన్ని వార్తలు