కుట్ర పన్ని కేసులు వేశారు

24 Mar, 2018 02:55 IST|Sakshi

కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌ ధ్వజం

నా దగ్గర ఆధారాలున్నాయి.. 

కాంగ్రెస్‌ సభ్యులుంటే బయటపెట్టే వాడిని

నీటి పారుదల శాఖ పద్దులపై సభలో చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు కుట్రలు పన్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. చనిపోయిన వారు, గ్రామాల నుంచి వలస వెళ్లిన వారి పేర్లతో న్యాయస్థానాల్లో కేసులు వేయించారని ఆరోపించారు. ప్రాజెక్టులపై కేసులు వేసిన న్యాయవాదులకు రూ.లక్షలు ఫీజులు చెల్లించారన్నారు. కేసుల విచారణకు వెళ్లే న్యాయవాదులకు డెబిట్‌ కార్డులతో విమాన టికెట్లు బుక్‌ చేశారని తెలిపారు.

వీటన్నింటికి సంబంధించిన ఆధారాలతో కాంగ్రెస్‌ సభ్యుల ముందు మాట్లాడటానికి వచ్చానని, దురదృష్టవశాత్తు సభలో వారు లేరన్నారు. వచ్చే సమావేశాల్లో అయినా ఈ ఆధారాలను కాంగ్రెస్‌ సభ్యుల ముందు ఉంచి మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఆధారాలను వెల్లడించి సభ బయట కూడా మాట్లాడవచ్చని, కాని సభలోనే మాట్లాడాలని అనుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర నీటి పారుదల ఆర్థిక పద్దులపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో మాట్లాడారు.

కొత్తగా 11 లక్షల ఎకరాలు సాగులోకి..  
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 53 శాతం తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ గురువారం పార్లమెంటుకు తెలిపారని హరీశ్‌ గుర్తు చేశారు. బీజేపీ పాలిత మహారాష్ట్ర, కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్, సాగునీటి సరఫరా కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతు ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నా రు.  పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ ఆశయం మేరకు కోటి ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి వివరాలను సభకు వివరించారు. 

>
మరిన్ని వార్తలు