సముద్రంలో నీటిబిందువు రేవంత్‌ 

31 Oct, 2017 03:08 IST|Sakshi

మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేల ఆసక్తికర చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎ.జీవన్‌రెడ్డిల మాటా ముచ్చట ఆసక్తిగా సాగింది. ముగ్గురి మధ్య.. ఏది ధర్మం.. ఏది న్యాయం.. అన్న పాయింట్‌ నుంచి మొదలైన సంభాషణ రేవంత్‌ చేరిక వరకు వెళ్లింది. ‘తెలంగాణ ఇచ్చినందుకు ధర్మం తప్పకుండా సోనియాగాంధీ ఇంటికెళ్లి కేసీఆర్‌ కలవటం న్యాయమే.. అయితే మా వాళ్లు ఎన్నికల్లో కలుపుకోకుండా తప్పు చేశారు’అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ‘మీరు కలుపుకోనందుకే టీఆర్‌ఎస్‌ గెలిచి.. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది’అని ముత్తిరెడ్డి బదులుగా స్పందించారు.

‘అవును నిజమే.. అదే ఇప్పుడు మాకు సమస్య అయింది’అంటూ జీవన్‌రెడ్డి అనడంతో ముగ్గురూ నవ్వుకున్నారు. అదే సమయంలో ‘రేవంత్‌రెడ్డిని ఎందుకు పెద్ద లీడర్‌ని చేస్తున్నారు..’అంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరడం సముద్రంలో నీటి బిందువు చేరడం లాంటిదే..’అంటూ ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎమ్మెల్యేల మాటలు విని జీవన్‌రెడ్డి నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.   

మరిన్ని వార్తలు