హరీశ్‌రావును తిట్టడం ఒక్కటే ఆయన పని

23 Jun, 2020 14:37 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని చెప్పి కనీళ్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని గెలిచిన జగ్గారెడ్డి, ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయారని విమర్శించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక  నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. మంగళవారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ సమక్షంలో పలువురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీశ్‌రావు వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ప్రవర్తనతో విసుగు చెందే పలువురు కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. అసలు ఆయన సంగారెడ్డికి వచ్చే పరిస్థితే లేకుండా పోయిందన్నారు. మూడు నెలలకు ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చి మంత్రి హరీశ్‌రావును తిట్టడం తప్ప చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో పసలేదు : మంత్రి హరీశ్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధిని చూసి పలు పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్‌ తెచ్చారని ప్రశంసించారు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఆదుకున్నామని చెప్పారు. బియ్యం, సరుకులు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ నేతలు తెలంగాణను మెచ్చుకుంటుంటే, లోకల్‌ ఎమ్మెల్యేలు తిట్టడం తప్ప చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో పసలేదన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు