‘నిన్న ఈవీఎంలు అన్నారు.. నేడు చంద్రబాబు అంటున్నారు’

19 Dec, 2018 11:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని పెండింగ్‌ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మంగళవారం కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రవిశంకర్‌ ప్రసాద్‌లను కలిసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి ప్రతిపక్షాలు కుంటి సాకులు వెతుకుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి తొలుత ఈవీఎంల ట్యాంపరింగ్‌ అన్నారని.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ తరఫున కీలక భూమిక పోషిస్తామని తెలిపారు.

మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించాలని గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. తక్షణమే హైకోర్టును విభజించాలని మంత్రులకు చెప్పినట్టు తెలిపారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కేంద్రం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఎటువంటి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు.  బీజేపీ కేవలం మాటల ప్రభుత్వం అని విమర్శించారు.

కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దుకు తర్వాత కూటమి ఏర్పాటయిందని గుర్తుచేశారు. కూటమి కట్టకముందే కాంగ్రెస్‌ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

>
మరిన్ని వార్తలు