పల్లె పోరులో కారు జోరు

22 Jan, 2019 10:35 IST|Sakshi

పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల హవా  

మేడ్చల్‌ జిల్లాలో తొలివిడతలో మెజార్టీ స్థానాల్లో గెలుపు

ఎన్నికలకు ముందే నాలుగు గ్రామాల్లో ఏకగ్రీవంతో బోణీ

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో సోమవారం మొదటి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల హవా కొనసాగింది. నాలుగు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలతోపాటు 40 వార్డు స్థానాలను తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో ఏకగ్రీవం చేసుకోవటం ద్వారా బోణీ కొట్టిన టీఆర్‌ఎస్‌... మొదటి విడత ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. జిల్లాలో 29 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు సోమవారం జరిగిన మొదటి విడత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు 14 చోట్ల గెలుపొందారు. తర్వాతస్థానంలో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, బీజేపీ, బీఎస్పీ కూడా తమ ఉనికి నిలుపుకున్నాయి. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం మేరకు 28 గ్రామ పంచాయతీ స్థానాల ఫలితాలు విడుదల కాగా, ఇందులో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు 14 మంది గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆరుగురు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఒకరు, బీస్పీ బలపరిచిన అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు ఆరుగురు గెలుపొందారు. ఇక లాల్‌గడ్‌ మలక్‌పేట స్థానంలో కౌంటింగ్‌ కొనసాగుతుండగా ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. 

టీఆర్‌ఎస్‌ గెలుపొందిన పంచాయతీలివే  
శామీర్‌పేట్‌ మండలంలో మురహరిపల్లి, ఉద్ధమర్రి, అనంతారం, అడ్రాస్‌పల్లి, బాబాగూడ, బొమ్మరాసుపేట్, కేశవరం, లింగాపూర్‌ తండా, పోతారం, లక్ష్మాపూర్, కీసర మండలంలో కేశ్వాపూర్, తిమ్మాయిపల్లి, రాంపల్లి దాయర, కీసర పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థు«లు గెలుపొందారు.

ఐదింటిలో కాంగ్రెస్‌  
శామీర్‌పేట్‌ మండలంలో కోల్తూర్, నారాయణపూర్, తుర్కపల్లి, కీసర మండలంలో బోగారం, చీర్యాల, శామీర్‌పేట పంచాయతీల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 

స్వతంత్ర అభ్యర్థులు..  
టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులుగా కీసర మండలంలో యాద్ఘార్‌పల్లి, కరీంగూడ, గోధుమకుంట, అంకిరెడ్డిపల్లి, మజీద్‌పూర్,అలియాబాద్‌ గ్రామ పంచాయతీల్లో గెలుపొందారు. వీరంతా త్వరలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తున్నది.  
ఇక శామీర్‌పేట్‌ మండలం జగ్గన్‌గూడ పంచాయతీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలువగా, పొన్నాల పంచాయతీలో బీస్పీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు.

ఫలించిన టీఆర్‌ఎస్‌ వ్యూహాం
పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవటానికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌ తదితర జిల్లా, మండల నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఏకగ్రీవంలోనూ టీఆర్‌ఎస్‌  
జిల్లాలో కీసర, శామీర్‌పేట్‌  మండలాల పరిధిలో 33 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాల్లో నాలుగు స్థానాలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. అలాగే 322 వార్డు స్థానాల్లో 40 వార్డు సభ్యుల పదవులను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా  కైవసం చేసుకున్న పంచాయతీల్లో  కీసర మండలంలో నర్సంపల్లి సర్పంచ్‌ స్థానంతోపాటు ఆరు వార్డు స్థానాలు, శామీర్‌పేట్‌ మండలంలో యాడారం, నాగిశెట్టిపల్లిలో సర్పంచ్‌ స్థానాలతోపాటు వార్డు సభ్యుల పదవులు, మూడు చింతలపల్లి సర్పంచ్‌ స్థానంతో పాటు ఒక వార్డు పదవి స్థానం ఉంది. 

మరిన్ని వార్తలు