టీఆర్ఎస్లో చల్లారని అసంతృప్తి జ్వాలలు
ఓదెలుకు టికెట్ ఇవ్వాలంటూ అనుచరుడి ఆత్మహత్యాయత్నం
తాము పోటీలో ఉంటామని అసమ్మతి నేతల స్పష్టీకరణ
అసంతృప్తులతో కేటీఆర్, హరీశ్ చర్చలు
గెలుపు కోసం పనిచేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో అసెంబ్లీ టికెట్ల వ్యవహారం రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. అభ్యర్థులను ప్రకటించి వారం రోజులు కావస్తున్నా, చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి కొనసాగుతోంది. టికెట్ ఆశించి భంగపడినవారు స్వతంత్రంగా బరిలోకి దిగుతామని ప్రకటిస్తున్నారు. అందుకు అనుగుణంగా రంగంలోకి కూడా దిగిపోతున్నారు. టికెట్ ఖరారైన అభ్యర్థుల కంటే వేగంగా ప్రచారం కూడా షురూ చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ అభ్యర్థులను మార్చాల్సిందేనని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు రంగంలోకి దిగారు. ఆయా నేతలతో చర్చలు జరిపి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
ఓదెలుకు సీఎం నుంచి పిలుపు
చెన్నూరు నియోజకవర్గ టికెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు కాకుండా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్కు కేటాయించడంతో గులాబీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఓదెలు శాంతియుత కార్యక్రమాలతో నిరసనలకు దిగారు. మంగళవారం తనకు తానుగా గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో వెంటనే వచ్చి సీఎం కేసీఆర్ను కలవాలని ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు ఓదెలుకు ఫోన్ చేసి చెప్పారు. బుధవారం ఉదయమే ఆయన హైదరాబాద్కు బయలుదేరారు. అయితే జైపూర్ మండలం ఇందారంలో బాల్క సుమన్ ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఓదెలు వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తాజా ఘటనతో చెన్నూరు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఇక చాలా నియోజకవర్గాల్లోనూ అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
కేటీఆర్ బుజ్జగింపులు...
మక్తల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి టికెట్ లభించింది. అయితే, ఆరుగురు అసంతృప్తి నేతలు తమలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు. వారంతా రామ్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా మండలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్ బుధవారం చర్చలు జరిపారు. అభ్యర్థిని మార్చాలని అసంతృప్త నేతలు కోరగా, పార్టీ అభ్యర్థి కోసం కలిసి పని చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. కల్వకుర్తిలో టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గోలి శ్రీనివాస్రెడ్డి, విజితారెడ్డి, బాలాజీసింగ్లతో కేటీఆర్ చర్చలు జరిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ విజయానికి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
హరీశ్రావు మంతనాలు
ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోని పలు నియోజకవర్గాల అసంతృప్త నేతలతో మంత్రి హరీశ్రావు చర్చలు జరిపారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్టీ ప్రకటించిన వారి గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని ఆదేశించారు. అంథోల్ అభ్యర్థి క్రాంతికిరణ్ గెలుపు కోసం పని చేయాలని స్థానిక నేతలకు సూచించారు. నర్సాపూర్ అభ్యర్థి మదన్రెడ్డి, ఆయన వ్యతిరేక వర్గీయులతో హరీశ్ చర్చలు జరిపారు. నారాయణఖేడ్ అభ్యర్థిగా ప్రకటించిన భూపాల్రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారికి సర్దిచెప్పారు. అభ్యర్థిని మార్చడం సాధ్యంకాదని పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ను అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణకు సర్ది చెప్పారు. అలంపూర్ అభ్యర్థిగా అబ్రహంను ప్రకటించడంతో టికెట్ ఆశించిన మాజీ ఎంపీ మందా జగన్నాథం అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరితో హరీశ్రావు మాట్లాడి, అబ్రహాం గెలుపు కోసం పని చేయాలని జగన్నాథంకు సూచించారు. గద్వాలలో టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్రెడ్డి, టికెట్ ఆశించిన గట్టు తిమ్మప్ప, చంద్రశేఖర్రెడ్డిలతోనూ హరీశ్ మట్లాడారు. అందరూ కలిసి కష్ణమోహన్రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు.