కారు స్పీడ్‌ తగ్గింది!

23 May, 2019 21:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ దూకుడు కొనసాగించలేకపోయింది. కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిజామాబాద్ లోక్‌సభ  స్థానంలో కేసీఆర్‌ కుమార్తె కవిత ఓటమి చెందడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. మొత్తం 17 స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందింది.
 
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి 16 స్థానాలను గెలుచుకుంటామంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతూ వచ్చారు. సారూ, పదహారూ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే పల్లవి అందుకున్నాయి. 16 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని, ఇంకో స్థానం పరోక్ష మిత్రపక్షమైన ఎంఐఎం గెలుచుకుంటుందని ప్రచారంలోనూ హోరెత్తించారు. తాజాగా వచ్చిన ఫలితాలు మాత్రం కేసీఆర్ అంచనాలను తారుమారు చేశాయి. 
 
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కాస్త పుంజుకొని మూడు చోట్ల ( భువనగిరి, నల్గొండ, మల్కాజ్‌గిరి) గెలుపొందగా, బీజేపీ అన్యూహ్య రీతిలో నాలుగు చోట్ల విజయ దుందుభిని మోగించింది. నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది.

ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్‌
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభ ఎన్నికల్లో కాస్త పుంజుకుంది. ఒక్క చోట కూడా గెలుపు కష్టమే అనుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఎవరూ ఊహించనిరీతిలో, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను సైతం తలకిందుల చేస్తూ మూడు చోట్ల విజయం సాధించింది.  నల్గొండ(ఉత్తమ్‌ ​కుమార్‌ రెడ్డి), భువనగిరి(కొమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, మల్కాజ్‌గిరి (రేవంత్‌ రెడ్డి)నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ప్లాన్‌ ప్రకారం సీనియర్లకు టికెట్‌ ఇవ్వడం, టీఆర్‌ఎస్‌ కొత్త వారికి బరిలోకి దింపడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.

వికసించిన కమలం​
ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ భారీగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రందూసుకెళ్లారు. నాలుగు స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ స్థానాల్లో బీజేపీగెలుపొందింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఇతర అగ్రనేతల ప్రచారం రాష్ట్రంలో కలిసొచ్చింది. మోదీ ప్రజాకర్షణ మంత్రం, అమిత్‌షా రాజకీయ చతురత రాష్ట్రంలో పనిచేసింది . 2014 ఎన్నికల్లో కేవలం ఒక్క లోక్‌సభ (సికింద్రాబాద్‌) స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నబీజేపీ ఆ సారిఅనూహ్యంగా నాలుగు స్థానాలను గెలుపొంది ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను తలక్రిందులు చేసింది. అలాగే కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం రాష్ట్ర పార్టీశ్రేణులకు మరింత ఉత్సాహాన్ని కలిస్తోంది.

ఎంఐఎంకు ఎదురులేదు 
ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఈ సారి కూడా తన ఖాతాలోనే వేసుకుంది. వరసగా మూడు పర్యాయాలు విజయం సాధించిన ఎంఐఎంఅధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి హైదరాబాద్‌ నియోజకవర్గంలో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. భారీ మెజారిటితో అసదుద్దీన్‌ గెలుపొందారు.

మరిన్ని వార్తలు