‘మతం పేరిట బీజేపీ రాజకీయం’

13 Mar, 2019 16:29 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కామారెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణా వాసులు సత్తా చాటాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జహీరాబాద్‌ పార్లమెంటు టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరవేయాలో మనమే నిర్ణయించాలని అన్నారు. బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి ఏం చేస్తారని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఇద్దరు ఎంపీలతో కేసీఆర్‌ తెలంగాణ తెచ్చినా కూడా వాళ్లకు గుర్తులేదేమో అని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండని మోదీని అడిగామని, కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన షబ్బీర్‌ అలీ మళ్లీ ఈసారి జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తున్నారట.. మళ్లీ కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలను కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడివారక్కడ పని చేసి బూత్‌ లెవెల్లో సత్తా చాటాలని సూచించారు. కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లకు కూడా రైతు బంధు చెక్కులు, షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మీ, పెన్షన్‌లు అన్నీ వెళ్తున్నాయని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు