ముగిసిన ప్రచారం 

13 May, 2019 10:15 IST|Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: ప్రచార పర్వానికి తెర పడింది. ఓట్ల కోసం ప్రలోభాల వేట మొదలైంది. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఆర్మూర్‌ డివిజన్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం నాటి పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడో విడత ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. హోరాహోరీ పోరులో గట్టెక్కేందుకు అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, మాంసం, నగదు ఎర వేస్తున్నారు. పది రోజులుగా ఎడతెరిపి లేకుండా ప్రచారం చేసిన అభ్యర్థులు ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

మూగబోయిన మైక్‌లు
ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల్లో పరిషత్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఆర్మూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, నందిపేట, వేల్పూరు మండలాల్లోని 11 జెడ్పీటీసీ, 124 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను 40 మంది పోటీలో ఉండగా, 117 ఎంపీటీసీ స్థానాల్లో 372 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత పది రోజులుగా అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు తదుపరి ‘కార్యాచరణ’పై దృష్టి సారించారు.

ఏర్పాట్లు పూర్తి 
ఈ నెల 14తో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 27న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తుది విడత పోలింగ్‌ జరుగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఆయా మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులను, ఎన్నికల సామగ్రిని తీసుకొని పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. మరోవైపు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1500 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు.

ప్రలోభాల పర్వం.. 
ప్రచారం ముగియడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ నజరానాలు అందజేస్తున్నారు. మాంసం, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపారు. ఆర్మూర్‌ మండలంలో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు, నందిపేటలో ఆరుగురు, బాల్కొండలో ఆరుగురు, ముప్కాల్‌లో ముగ్గురు, జక్రాన్‌పల్లి నలుగురు, ఏర్గట్లలో ఇద్దరు, మోర్తాడ్‌లో ముగ్గురు, భీమ్‌గల్‌లో ముగ్గురు, మెండోరలో ముగ్గురు చొప్పున జెడ్పీటీసీ స్థానాలకు పోటీపడుతున్నారు. హోరాహోరీ పోటీ ఉండడంతో అభ్యర్థులు గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు