చిన్నమ్మతో ములాఖత్‌

6 Aug, 2019 08:01 IST|Sakshi
శశికళ (ఫైల్‌)

సాక్షి, చెన్నై : బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో చిన్నమ్మ శశికళతో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ములాఖత్‌ అయ్యారు. జరిమానా చెల్లింపు వ్యవహారంగా చర్చ సాగినట్టు సమాచారం.అక్రమాస్తుల కేసులో అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సత్ప్రవర్తన కారణంగా చిన్నమ్మను ముందస్తుగానే విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రయత్నాల్లో అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ కూడా ఉన్నారని చెప్పవచ్చు.

అయితే, జైలు శిక్ష సమయంలో వి«ధించిన జరిమానాను ఇంకా చెల్లించనట్టు, ఇది కాస్త విడుదలకు అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు గత వారం వెలువడ్డాయి. దీంతో జరిమానా చెల్లింపు వ్యవహారంతో పాటుగా, రాజకీయ పరంగా చిన్నమ్మను సంప్రదించి, సలహాలు, సూచనలకు దినకరన్‌ బెంగళూరు వెళ్లారు. సోమవారం శశికళతో ములాఖత్‌ అయ్యారు. ఆమె ఇచ్చిన సలహాల్ని అమలు చేయడానికి తగ్గట్టుగా సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా దినకరన్‌ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం బలహీన పడలేదన్నారు. తాము బలంగానే ఉన్నామని, తమ వాళ్లు తమ వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే, డీఎంకేలతో సంబంధాల్ని ఏర్పరచుకోవద్దని కేడర్‌కు హెచ్చరికలు పంపారు.

మరిన్ని వార్తలు