దినకరన్‌ సంచలన నిర్ణయం

16 Jan, 2018 11:24 IST|Sakshi

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొత్తపార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం పుదుచెర్రిలో మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 

అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంజీఆర్‌ జయంతి వేడుకల నేపథ్యంలో దినకరన్‌ కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నీమధ్యే ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో దినకరన్‌ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. మూడు నెలలో ప్రభుత్వం కూలిపోతుందని.. అన్నాడీఎంకే నుంచి బయటకు రావాలంటూ ఆ సందర్భంలో దినకరన్‌ నేతలకు పిలుపునిచ్చాడు.

శశికళ జైలుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి.. పన్నీర్‌సెల్వంతో కలిసి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశికళ-దినకరన్‌ వర్గంపై వేటు వేసి, వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్‌ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు స్పష్టమౌతోంది.

మరిన్ని వార్తలు