సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. సంఖ్యాబలం పెంచుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ‘ఆపరేషన్ కమల’తో రంగంలోకి దిగగా.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్లు మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ‘అజ్ఞాతం’లోకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. విజయనగర, మస్కీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి సైతం వారు హాజరుకాలేదు. దీంతో వారు బీజేపీ తరఫు వెళ్లారా? అనే ఆందోళనలు పార్టీలో మొదలయ్యాయి.
ఆనంద్ సింగ్ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. అనంతరం విజయనగర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు పోటీ చేసి గెలుపొందారు. బీజేపీకి శాసనసభలో బల నిరూపణకు గవర్నర్ 15 రోజులు గడువు ఇవ్వడంతో కాంగ్రెస్-జేడీఎస్లు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్కు తరలిస్తున్నారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో వారికి బస కల్పిస్తున్నట్లు సమాచారం ఉంది.