మీరు మా హృదయాలను గెలుచుకున్నారు!

23 Mar, 2019 13:29 IST|Sakshi
బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించిన జెసిండా ఆర్డర్న్‌ ఫొటో

న్యూజిలాండ్‌ ప్రధానికి యూఏఈ ప్రశంసలు

సాక్షి, వెల్లింగ్టన్‌: యూఏఈ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన తమ కట్టడం బుర్జ్‌ ఖలీఫాపై న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డర్న్‌ చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ నెల 15న న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై శ్వేత జాతీయుడు కాల్పులు జరిపినప్పుడు తక్షణమే స్పందించి, అక్కడి ముస్లింలకు అండగా  నిలబడినందుకు కృతజ్ఞతగా యూఏఈ ప్రభుత్వం ఆమె చిత్రాన్ని బుర్జ్‌పై ప్రదర్శించింది. న్యూజిలాండ్‌ జరిగిన ఆ కాల్పుల్లో ఐదుగురు భారతీయులు కూడా చనిపోయిన సంగతి తెలిసిందే.

యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అలీ మక్తమ్‌ ముస్లింలకు బాసటగా నిలిచిన జసింగా ఆర్డర్న్‌కు ధన్యవాదాలు తెలుపుతూ బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించిన ఆమె ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. న్యూజిలాండ్‌లో జరిగిన దాడితో మొత్తం ముస్లిం సమాజం భయాందోళనలకు గురైందని.. సరైన సమయంలో బాధితులకు భరోసాగా నిలిచిన జసిండా 1.5 బిలియన్ల ముస్లింల మనసులను  గెలుచుకున్నారనేది ఆయన ప్రశంసించారు.

ఈ ట్వీట్‌కు జసిండా బదులిస్తూ.. ‘న్యూజిలాండ్‌లో పుట్టకపోయినా, ఈ ప్రాంతంలో జీవించడానికి నిర్ణయించుకొని  వలస వచ్చిన వారికి రక్షణ కల్పించే బాధ్యత మా మీదే ఉంది. తమ సంస్కృతీ, సంప్రదాయాలను స్వేచ్ఛగా పాటించే హక్కు ఇక్కడ నివసిస్తున్న వలస ప్రజలకూ ఉంది. అలాంటి వారికి మేం అండగా ఉంటాం’ అని తెలిపారు. మార్చి 15న జరిగిన కాల్పుల నుంచి న్యూజిలాండ్‌ క్రికెట్‌ టీమ్‌తోపాటు, పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ జట్టు తృటిలో తప్పించుకున్నాయి.  రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్ట్‌ రద్దు చేసి, బంగ్లా టీమ్‌ను వెంటనే స్వదేశానికి పంపే ఏర్పాట్లను చేసింది అక్కడి ప్రభుత్వం. కాల్పులకు  తెగబడ్డ వ్యక్తి బ్రెండన్‌ టరెంట్‌ (28)ను ఆస్ట్రేలియన్‌గా భావిస్తున్నారు. ఏప్రిల్‌ 5న టరెంట్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు