గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే దంపతులు!

27 Nov, 2019 10:12 IST|Sakshi

ముంబై: శివసేన అధినేత, కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ బుధవారం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. ఒకవైపు అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మరోవైపు ఉద్ధవ్‌ రాజ్‌భవన్‌ వెళ్లి.. మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. గురువారం ముంబైలోని శివాజీ పార్కులో అట్టహాసంగా జరగనున్న కార్యక్రమంలో మహా వికాస్‌ అఘాది (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి) తరఫున ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం భేటీ అయి.. ఉద్ధవ్‌ ఠాక్రేను తమ కూటమి నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మూడు పార్టీల నేతలు బృందంగా వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. తమ కూటమికి 166మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలిపారు. ఇందుకుప్రతిగా ఉద్ధవ్‌కు లేఖ రాస్తూ.. డిసెంబర్‌ 3లోగా అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు లేఖ ఇవ్వాల్సిందిగా సూచించారు. మరోవైపు శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో కొత్త మార్పు రాబోతోంది. మిషన్‌ కంప్లీట్‌ అయింది. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం కాబోతున్నారు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు