సాక్షి, గుంటూరు : అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ అబద్ధాల ప్రసంగం చేశారని వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా ప్రభుత్వం అని చెప్పుకునే గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా చూస్తుండిపోయారన్నారు. గవర్నర్ వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారని తెలిపారు.
రాష్ట్ర ఆదాయంలో మూడు శాతం ఉండాల్సిన ఆర్ధిక క్రమశిక్షణ ఇప్పుడు 5.6 శాతానికి పెరిగిందని వెల్లడించారు. వచ్చే ప్రభుత్వాల ఆర్ధిక క్రమశిక్షణ కూడా చంద్రబాబు అధిగమించారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో నిందితులు టీడీపీ నేతలేనని, అందుకే ఎన్ఐఏ విచారణను అడ్డుకుంటున్నారని అన్నారు.