ఏ చర్చకైనా సిద్ధం: ఉండవల్లి

6 Sep, 2018 13:19 IST|Sakshi
మాజీ ఎంపీ ఉండవల్లి ఆరుణ్‌ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, రాజమండ్రి: అమరావతి బాండ్ల విషయంపై గొడవ రాజుకుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అమరావతి బాండ్ల అవకతవకలపై ప్రశ్నిస్తుండగానే మాజీ ఎంపీ ఉండవల్లి ఆరుణ్‌ కుమార్‌ సవాల్‌తో మరింత రాజుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విసిరిన సవాల్‌పై గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి స్పందించారు. ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకంపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. కానీ ప్రజలకు బహిరంగ చర్చలపై నమ్మకం పోయిందని, ఒక గదిలో రెండు కెమెరాల సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఆ ఒక్క పుస్తకంపైనే కాకుండా చాలా అంశాలపై కుటుంబరావు మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో కుటుంబరావు జీతం తీసుకుంటున్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. టీడీపీ నేతగా కుటుంబరావు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని ఉండవల్లి పేర్కొన్నారు. తప్పు చేస్తే నిర్భయంగా ఒప్పుకునే మనస్తత్వం తనదని తెలిపారు.

తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగటం సరికాదన్నారు. చంద్రబాబుపై ఈర్ష్యతో మాట్లాడుతున్నానడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన తనకు రాజకీయ ప్రత్యర్థిని కాదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. కుటుంబరావు తనను పేపర్‌ టైగర్‌ అంటున్నారని, కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి సభలో కనీసం ప్రస్తావించలేని టీడీపీ ఎంపీలు పేపర్‌ టైగర్లు కాదా అని ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ఉండవల్లి స్పష్టం చేశారు.


 

మరిన్ని వార్తలు