సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 350 కోట్ల నిధులను వెనక్కి తీసుకోలేదని.. ఈ నిధులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ఏపీకి ఇస్తామని చెప్పామని, అన్న మాట ప్రకారమే రాజధాని నిర్మాణానికి 2500 కోట్ల రూపాయలు ఇచ్చామని.. మరిన్ని నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
నాలుగేళ్లుగా మాతో కలిసి ఉన్న చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు బీజేపీపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని జితేంద్ర విమర్శించారు.