భూస్వాముల అడ్డా..ఉరవకొండ

30 Mar, 2019 09:13 IST|Sakshi

ఉరవకొండ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2009లో నియోజకవర్గ పునర్విభజన అనంతరం ఉరవకొండ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఇప్పటి వరకూ 12 సార్లు జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే పైచేయిగా నిలుస్తూ వచ్చింది. సాగునీటి వనరులు అంతంత మాత్రమే ఉన్న ఈ నియోజకవర్గంలో ఆది నుంచి అత్యధిక జనాభా చేనేతరంగంపైనే ఆధారపడి జీవిస్తూ వచ్చింది. అణగారిన, పీడిత వర్గాలే నియోజకవర్గంలో అత్యధికులు ఉన్నారు.  

మొత్తం ఓటర్లు :2,07,7
పురుషులు:1,04,1
మహిళలు:1,03,5
ఇతరులు :19

పెత్తందారీ ఆధిపత్యంలో హత్యా రాజకీయాలు 
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడుతున్నా.. నేటికీ ఉరవకొండ నియోజకవర్గంలో భూస్వామ్య వాసనలు పోలేదు. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం అన్న చందంగా నేటికీ వారి వంశీకులు శాసిస్తూ వస్తున్నారు. వారిని కాదని మనుగడ సాగించడం చాలా కష్టం. నియోజకవర్గంలోని కౌకుంట్లలో భూస్వాముల ఆధిపత్యంపై కమ్యూనిస్టులు సాగించిన పోరాటం చారిత్రాత్మకం. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలో కౌకుంట్లలో భూస్వాముల అరాచక పాలన పేట్రెగిపోయింది. వందలాది ఎకరాల పేదల భూములను ప్రస్తుత ఎమ్మెల్సీ చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ తండ్రి పయ్యావుల వెంకటనారాయణప్ప తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించేవారు.

ఇది అన్యాయమంటూ ఎవరైనా గొంతెత్తితే భరించలేనంతగా దాడులు, దౌర్జన్యాలు చేసేవారు. అదే సమయంలో వెంకటనారాయణప్ప ఆధీనంలో ఉన్న పేదల భూములను వెంటనే పేదలకు స్వాధీనం చేయాలంటూ సీపీఐ నేత రాకెట్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతంగా ఎగిసిపడ్డాయి. నారాయణరెడ్డి పోరాటాలతో ఎన్టీఆర్‌ ప్రభుత్వం దిగొచ్చింది. స్వయానా కౌకుంట్ల గ్రామానికి ఎన్టీఆర్‌ వచ్చి భూ సమారాధన పేరుతో పయ్యావుల కుటుంబీకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న పేదల భూములను ఆ పేదలకే పంచి పెట్టారు. దీనిని జీర్ణించుకోలేని పెత్తందారులు రాకెట్ట నారాయణరెడ్డి, ఆయన కుమారుడు రవీంద్రారెడ్డిని అతి దారుణంగా హతమార్చి నెత్తుటి రాజకీయాలకు బీజమేశారు.  

చతికిల బడ్డ చేనేత పరిశ్రమ 
చేనేతకు ప్రసిద్ధిగాంచిన ఉరవకొండలో చేనేత పార్క్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు గతంలో హామీనిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో నేడు ఉరవకొండలో చేనేతలు ఉనికి కోల్పోయారు. గతంలో 15 వేలకు పైగా మగ్గాలు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఐదు వేలకు మించి లేవు. దాదాపు మూడు వేలకు పైగా చేనేత కార్మికులు మగ్గాలు వదిలి కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నారు.  

ఒక్క ఎకరాకూ అందని సాగునీరు 
హంద్రీ–నీవా మొదటి దశ కింద నియోజకవర్గంలోని 80వేల ఎకరాల ఆయకట్టును గుర్తించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు. ఐదేళ్లుగా కంటి ముందే నీరు పారుతున్నా.. పొలాలకు పెట్టుకోలేక రైతులు పడ్డ కష్టం మాటల్లో వర్ణించలేనిది. హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తన సొంత నియోజకవర్గం కుప్పంకు తరలించుకుపోయేందుకు ఈ ప్రాంత రైతులకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు.   

జీడిపల్లి నిర్వాసితులకు మొండి చెయ్యి 
బెళుగుప్ప మండలంలో జీడిపల్లి రిజర్వాయర్‌ ఏర్పాటు సమయంలో ముంపు గ్రామాల ప్రజలకు మరో ప్రాంతంలో పక్కా గృహాలు నిర్మించి ఇస్తామంటూ సీఎం చంద్రబాబు రెండు పర్యాయాలు పక్కా హామీనిచ్చారు. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు. అయితే ముంపు గ్రామాల బాధితులను ఆదుకోకుండా  నిర్లక్ష్యం వహించారు. ఈ విషయంలో సీఎంతో చర్చించి నిర్వాసితులకు న్యాయం జరిగిలే చూడడంలో ఎమ్మెల్సీ చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ పూర్తిగా విఫలమయ్యారు.  

ఐదేళ్లలో ‘విశ్వ’ పోరాటాలు 
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఓటమి పాలైన పయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి సీఎం చంద్రబాబు తన కులపిచ్చిని బహిర్గతం చేసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని కాదని తాను ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీకి నియోజకవర్గ పాలనపరమైన పగ్గాలు అప్పగించి దోపిడీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో హంద్రీ–నీవా పనుల అంచనాలను భారీగా పెంచి రూ. కోట్లలో కేశవ్‌ దోచుకున్నారు. గాలిమరల కంపెనీలకు భూములు కట్టబెట్టే విషయంలోనూ వ్యాపారం సాగించి రైతులను దగా చేస్తూ రూ. కోట్లు దోపిడీ చేశారు. కేశవ్‌ అక్రమాలపై విశ్వ సాగించిన పోరాటాలు ఒకానొక దశలో రాష్ట్రాన్ని కుదిపేశాయి.

ప్రధానంగా పేదలకు ఇంటిపట్టాలు, పక్కా గృహ నిర్మాణాల కోసం వేలాది మందితో రోడ్డు పై బైఠాయించి ఎమ్మెల్యే విశ్వ అరెస్ట్‌ అయ్యారు. నియోజకవర్గంలోని 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలంటూ రాగులపాడు పంప్‌హౌస్‌ను ముట్టడించారు. ఉరవకొండ, బెళుగుప్ప, వజ్రకరూరు మండలాల్లో జలజాగరణలు చేసి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తడి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పోరాటాల ఫలితంగా ఉరవకొండ పట్టణంలో పేదలకు ఇంటిపట్టాలు దక్కాయి.    

మరిన్ని వార్తలు