హుజూర్‌నగర్‌ నుంచే టీఆర్‌ఎస్‌ పతనం

30 Sep, 2019 04:37 IST|Sakshi

ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్‌

గరిడేపల్లి: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ఓటమితోనే టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభం కానుందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట, అబ్బిరెడ్డిగూడెం, లక్ష్మీపురం, సర్వారం గ్రామాల్లో జరిగిన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఒక్క ఆడ మనిషిని ఓడించడానికి 700 మంది టీఆర్‌ఎస్‌ నాయకులు హుజూర్‌నగర్‌లో మోహరించారంటే ఆ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. గలీజు రాజకీయాలకు మారు పేరుగా టీఆర్‌ఎస్‌ మారిందని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని, ప్రలోభాలకు తెరదించుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ మంత్రులు, నాయకులకు హుజూర్‌నగర్‌ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ‘నా సతీమణి పోటీ చేస్తున్న ఈ ఎన్నిక హుజూర్‌నగర్‌ ఆత్మ గౌరవ ఎన్నిక’అని ఉత్తమ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో 40 వేల మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతుందన్నారు. హుజూర్‌నగర్‌.. కాంగ్రెస్‌కు అడ్డ అని పేర్కొన్నారు. ఆరేళ్ల పాలనలో ఒక్క పనిచేయని టీఆర్‌ఎస్‌ నాయకులు.. ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతున్నారని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు