కేసీఆర్‌ మోసాలు బట్టబయలుకే యాత్ర

19 May, 2018 02:02 IST|Sakshi

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఎన్నికల కోసమే రైతుబంధు చెక్కులు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమానికి  పెద్దపీట వేస్తామని వెల్లడి

వరంగల్‌: సీఎం కేసీఆర్‌ ఈ నాలుగేళ్లలో చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకే ప్రజాచైతన్య యాత్రను నిర్వహిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో బహిరంగసభ నిర్వహించారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు వరంగల్‌ తూర్పు సభతో 38 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యయాత్రలు ముగిశాయన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పూర్తిగా విస్మరించిందని, సుమారు 4,200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క కుటుం బాన్ని కూడా పరామర్శించని అమానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని విమర్శించారు. పక్క రాష్ట్రాలు రైతులకు గిట్టుబాటు ధరల కోసం బడ్జెట్‌లోని నిధులను కేటాయిస్తుంటే.. కేసీఆర్‌ ఎందుకు అందించడంలేదని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే రైతుబం«ధు పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.

రైతుబంధు పథకానికి తాము వ్యతిరేకం కాదని.. అయితే, ముందుగానే ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళాసంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళా సంఘాలకు రూ.లక్ష గ్రాంటుగా, రూ.10 లక్షలు రుణాలుగా అందిస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. సభ కేవలం 34 నిమిషాల్లో ముగియడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యాయి.

వ్యవసాయ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ మంద వినోద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ నేతలు సీతక్క, నాయిని రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, నంది ఎల్లయ్య, దొంతి మాధవరెడ్డి, సంతోష్, పొదెం వీరయ్య, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, కోదండరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు