‘రాష్ట్రంలో కల్వకుంట్ల పోలీస్‌ సర్వీస్‌’

28 Dec, 2019 08:51 IST|Sakshi

గుర్రాలు,కర్రలతో చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి అనుమతిస్తారు

మేం జాతీయ జెండాలతో ర్యాలీ చేస్తామంటే అనుమతివ్వరా?: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇండియన్‌ పోలీస్‌ సరీ్వస్‌ పనిచేయడం లేదని, కల్వకుంట్ల పోలీస్‌ సరీ్వస్‌ పనిచేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  విమర్శించారు. కేసీఆర్‌ ఏది చెబితే దాన్ని  పోలీసులు అమలు పరుస్తున్నారన్నారు.  గాందీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్‌లతో కలసి ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడా లంటూ తాము నిర్వహించనున్న ర్యాలీకి అను మతి ఇవ్వకపోవడం విచిత్రంగా ఉందన్నారు.  

సీఎం సమాధానమివ్వాలి.. 
తాము ర్యాలీకి అనుమతి అడిగితే శాంతి భద్రతల గురించి చెబుతున్నారని, రెండ్రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ వరకు ఒక భయంకర వాతావరణంలో, గుర్రాలపై కర్రలు పట్టుకుని నిర్వహించిన కవాతుకు ఎలా అనుమతించారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భాగవత్‌ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలూ హిందువులేనని రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, అయినా ఆ సభకు పోలీసులు బందోబస్తు నిర్వహించారని చెప్పారు. దీన్నిబట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మత సంస్థలకు సీఎం కేసీఆర్‌ సహాయ, సహకారాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము జాతీయ జెండాలు పట్టుకుని ‘సేవ్‌ ఇండియా–సేవ్‌ కానిస్టిట్యూషన్‌’పేరుతో ర్యాలీ తీస్తామంటే అనుమతి ఇవ్వకపోవడం దారుణమని, దీనికి సీఎం కేసీఆర్‌ జవాబివ్వాలని డిమాండ్‌ చేశారు.  

ర్యాలీ తీసి తీరుతాం: వీహెచ్‌ 
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటే నిజామాబాద్‌లో ఎంఐఎం సభకు ఎలా అనుమతి ఇచ్చా రని వీహెచ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ లోపాయికారిగా ఆర్‌ఎస్‌ఎస్‌తో అవగాహన పెట్టుకున్నారని, ఎంఐఎంతో కూడా అదే ధోరణితో వెళ్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.  

డీజీపీకి మరోమారు విజ్ఞప్తి.. 
కాంగ్రెస్‌ తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. తాము మౌనంగా ర్యాలీ చేస్తామని, అడిగిన రూట్‌లో కాకపోయినా ఇతర రూట్లలో అయినా ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం ర్యాలీ చేసుకునేందుకు అనుమతినివ్వాలని కాంగ్రెస్‌ నేతలు మరోమారు లేఖలో కోరారు.   

మరిన్ని వార్తలు