సాక్షి, హైదరాబాద్ : ట్యాపరింగ్తోనే 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఆరోపణలపై ఈసీ సమాధానం చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర సంస్థ అయినా ఈసీపైనే ప్రజలకు అనుమానం రావడం దురదృష్టకరమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలకు వెళ్తుంటే మనకెందుకు ఈవీఎంలు అని ప్రశ్నించారు.
ఈవీఎంల ద్వారా ఎన్నికలకు వెళితే..ఓటు ఎవరికి వేశానో అనే అనుమానాలు ఓటర్ ఉన్నాయని.. ఇది బ్యాలట్ పేపర్తోనే నివృత్తి అవుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పోలింగ్కు, కౌటింగ్కు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. దీనిపై తాము వీవీ ప్యాడ్ల లెక్కింపుకు డిమాండ్ చేసినా ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల అధికారి రజత్ కుమార్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బ్యాలట్తో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేశారు.