ఓవైసీ.. కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడు పోయావు?

21 Nov, 2018 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్‌ చేయించిన కేసీఆర్‌కు అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు మద్దతు ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఓవైసీ ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న మేడ్చల్‌లో జరగనున్న కాంగ్రెస్‌ బహిరంగ సభాస్థలిని బుధవారం ఉత్తమ్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు.

ఈ శుక్రవారం మేడ్చల్‌లో ఓ చారిత్రాత్మక సభ జరుగుతుందని ఉత్తమ్‌ చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సోనియా గాంధీ తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారని, వారి సందేశం కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. సోనియా, రాహుల్‌ గాంధీ కలిసి పాల్గొనే మొదటి సభ మేడ్చల్‌లో జరుగుతుందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు నిరాశలే మిగిలాయన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టబోతున్నారని ఉత్తమ్‌ జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు