‘తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తాం’

23 Oct, 2018 18:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. 20వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హామీలు ఇవ్వడంలో కూడా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నకిలీనేనని విమర్శించారు. తాము ప్రకటించిన నిరుద్యోగ భృతికి 16 రూపాయలు పెంచి ప్రకటించడానికి సిగ్గు, శరం ఉండాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తండ్రి, కొడుకులు(కేసీఆర్‌, కేటీఆర్‌) ఇద్దరు అబద్దాల కోరులని.. ఆంధ్ర పాలకుల కంటే కేసీఆర్‌ కుటుంబమే తెలంగాణను ఎక్కువగా దోచుకుందని ఆరోపించారు. డిసెంబర్‌ 12న రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపడుతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు దోచుకోవడం, దాచుకోవడమే పని. కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఎంజాయ్‌ చేయడానికే సరిపోయింది. లక్ష స్క్వేర్‌ ఫీట్ల స్థలంలో కేసీఆర్‌ ఇళ్లు కట్టుకున్నారు. విమానాల్లో మనం టికెట్‌ కొని ప్రయణిస్తాం.. కానీ కేసీఆర్‌ ఏకంగా విమానాలే బుక్‌ చేసుకుంటున్నారు. కేటీఆర్‌ చదివింది ఆంధ్రలో, ఉద్యోగం చేసింది అమెరికాలో.. ఉద్యమంలో కానీ, ప్రభుత్వంలో కానీ ఆయన చేసింది ఏముంది?. మహాకూటమి అధికారంలోకి రాగానే ప్రైవేటు యూనివర్సిటీలు ఉండవు. కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలను బలోపేతం చేస్తాం. ప్రతి నిరుద్యోగి, విద్యార్థి ఒక్కొక్కరు 100 ఓట్లు వేయిస్తా అని మాట ఇవ్వండి. టీఆర్‌ఎస్‌ డబ్బు, మద్యంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంద’ని అన్నారు.

మరిన్ని వార్తలు