సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన దూకుడును పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు ముమ్మరం చేసిన అధిష్టానం.. పొత్తుల విషయంలోనూ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ విషయమై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో శనివారం హైదరాబాద్లో చర్చలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ వంటి నియంత పాలనలో తెలంగాణ ప్రజలు మగ్గకుండా ఉండాలంటే టీడీపీ సహా మిగతా పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు కాంగ్రెస్తో కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. టికెట్ల కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... అధిష్టానం నిర్ణయం మేరకు అభ్యర్థుల ఇంటికే బీఫారాలు పంపిస్తామని తెలిపారు.